టీవీకేతో కాంగ్రెస్ కలవడం, స్టాలిన్ ఓటమిపై కనిమొళి కీలక వ్యాఖ్యలు
- డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్
- తమకు నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు ఏ పార్టీకైనా ఉంటుందన్న కనిమొళి
- కాంగ్రెస్ నిర్ణయాన్ని గౌరవిస్తామని వ్యాఖ్య
- స్టాలిన్ ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామని వెల్లడి
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చి, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామాలపై డీఎంకే కనిమొళి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా తమకు నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని కనిమొళి పేర్కొన్నారు. డీఎంకే-కాంగ్రెస్ కలిసి చాలా ఎన్నికల్లో పనిచేశాయని, ఈసారి ఓటమి చవిచూశామని ఆమె తెలిపారు. కాంగ్రెస్ తన సొంత నిర్ణయం తీసుకుందని, దానిని తాము గౌరవిస్తామని చెప్పారు.
టీవీకే తనను తాను సెక్యులర్ పార్టీగా చెప్పుకోవడంపై స్పందిస్తూ... తమిళనాడులో మరో సెక్యులర్ పార్టీ రావడాన్ని తాము ఆహ్వానిస్తామన్నారు. దీనివల్ల డీఎంకేకు ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో డీఎంకే కేవలం 59 స్థానాలకు పరిమితం కావడం, స్వయంగా స్టాలిన్ కొలత్తూరులో ఓడిపోవడంపై పార్టీ కచ్చితంగా విశ్లేషణ చేసుకుంటుందని చెప్పారు. ప్రజలు మార్పును కోరుకున్నారని ఆమె అంగీకరించారు.
ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్కు ఆమె అభినందనలు తెలిపారు. ప్రజలు ఆశించిన రీతిలో టీవీకే పాలన అందిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.